కూలిన భవనం ఘటనతో కఠిన చర్యలకు కమిషనర్ సృజన ఆదేశాలు*
శేరీలింగంపల్లి,పరివర్తన అవాజ్ న్యూస్,ఆగస్ట్24
సైబరాబాద్: గచ్చిబౌలి అంజయ్యనగర్లో అనధికారంగా నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం కూలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) అనధికార నిర్మాణాలపై మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. నిర్మాణ దశలోనే అక్రమ భవనాలను గుర్తించి అడ్డుకోవడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న నిర్మాణాలపై ఎన్ఫోర్స్మెంట్ చర్యలను వేగవంతం చేయాలని కమిషనర్ టౌన్ ప్లానింగ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ఆదేశించారు.
ప్రత్యేకంగా 75 చదరపు గజాల కంటే తక్కువ స్థలంలో 7 మీటర్లకు మించి ఎత్తుతో నిర్మిస్తున్న భవనాలను గుర్తించాలని సూచించారు. అదే విధంగా 75 చదరపు గజాలకంటే ఎక్కువ స్థలంలో ఎలాంటి భవన నిర్మాణ అనుమతి లేకుండా చేపడుతున్న నిర్మాణాలను, వాటి ఎత్తుతో సంబంధం లేకుండా గుర్తించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఇటీవల అంజయ్యనగర్లో పరిమిత స్థలంలో బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టి, చివరకు భవనం కూలిపోవడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. నిర్మాణ నిబంధనలు, భద్రతా ప్రమాణాలు, అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో సీఎంసీ తాజా ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిర్మాణం పూర్తయిన తర్వాత కాకుండా, నిర్మాణ దశలోనే అక్రమ భవనాలను గుర్తించి అడ్డుకోవడంపై అధికారులు దృష్టి పెట్టాలని కమిషనర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
పౌరుల నుంచి ఫిర్యాదులు అందిన సందర్భాల్లోనే కాకుండా, క్షేత్రస్థాయి టౌన్ ప్లానింగ్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు స్వయంగా గుర్తించిన (suo motu) నిర్మాణాలపైనా వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను గుర్తించిన తర్వాత అవసరమైన ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లు నిర్వహించి కూల్చివేతలు చేపట్టాలని స్పష్టం చేశారు.
అంతేకాకుండా, ఈ ప్రత్యేక కేటగిరీల కింద చేపట్టిన కూల్చివేతల సంఖ్యను ఈ రోజు నుంచి ప్రతిరోజూ పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. ప్రతి ప్రాంతంలో క్షేత్రస్థాయి తనిఖీలు పెంచడం, అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణాలను త్వరగా గుర్తించడం, నిర్మాణదారులు నిబంధనలు ఉల్లంఘించే అవకాశం లేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
అంజయ్యనగర్ ఘటనలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా నిర్మాణ అనుమతులు, భవన ఎత్తు, స్థల విస్తీర్ణం, నిర్మాణ నిబంధనలపై అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజా ఆదేశాలతో అనధికార నిర్మాణాలపై సీఎంసీ ఎన్ఫోర్స్మెంట్ చర్యలు ఏ మేరకు వేగం పుంజుకుంటాయో వేచి చూడాలి.




