
ఆళ్లపల్లి, ఆగస్టు 26 , అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో వైద్య సహాయం అందించడంలో 108 అంబులెన్స్ సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఉమ్మడి ఖమ్మం జిల్లా 108 ప్రోగ్రామ్ మేనేజర్ నజీరుద్దీన్ అన్నారు.ఆళ్లపల్లి మండల కేంద్రంలో సేవలందిస్తున్న 108 అంబులెన్స్ ను బుధవారం ఆయన, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోఆర్డినేటర్ సతీష్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అంబులెన్స్ లోని అత్యవసర వైద్య పరికరాలు, మందులు, ఆక్సిజన్ సిలిండర్, ఇతర సామగ్రి పనితీరును పరిశీలించారు. వాహన లాగ్ బుక్, కేస్ షీట్లు, ఇతర రికార్డులను తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న ఈఎంటీ భాగ్యమ్మ, పైలెట్ శ్రీహర్షతో మాట్లాడి, అత్యవసర కేసులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందించాలని, అంబులెన్స్ లోని అన్ని పరికరాలు ఎప్పటికప్పుడు పనిచేసే స్థితిలో ఉంచాలని ఆదేశించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రమాదాలు, అనారోగ్య అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే 108 కి కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో సమయమే కీలకమని, ఒక్క క్షణం ఆలస్యం కూడా తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని, ప్రజలు ఆందోళన చెందకుండా 108 సేవలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.



