ఇల్లందు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం చల్లసముద్రం గ్రామపంచాయతీలో స్థానిక శాసనసభ్యులుకోరం కనకయ్య విశేష కృషితో ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) మంజూరు చేసింది. ఈ శుభవార్తతో గ్రామస్తులంతా ఎంతో సంతోషించినప్పటికీ, ఆసుపత్రి నిర్మాణానికి అనువైన ప్రభుత్వ స్థలం లేకపోవడం ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. సరైన స్థలం చూపించకపోతే ఈ ఆసుపత్రి కూడా పక్క పంచాయతీకి తరలిపోయే ప్రమాదం ఉందని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ ఊరికి మంజూరైన ‘రైతు వేదిక’ కూడా సరిగ్గా ఇలాగే స్థలాభావం వల్లే పక్క పంచాయతీకి తరలిపోయిన విషయాన్ని ప్రజలు ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు. ఆనాడు రైతు వేదిక పోయింది, ఇప్పుడు ఈ ఆసుపత్రి కూడా చేజారితే.. రేపటి రోజున ఆపదొచ్చినా, వైద్యం అవసరమైనా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పక్క పంచాయతీలకో, పట్టణాలకో పరుగులు తీయాల్సిన దుస్థితి వస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు.
ఈ విపత్కర పరిస్థితిలో గ్రామస్తులంతా ఊరిలోని పెద్దల వైపు ఆశగా చూస్తున్నారు. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ‘…….. సంఘం’ పెద్దలు పెద్ద మనసు చేసుకుని, వారి ఆధీనంలో ఉన్న స్థలంలోంచి కొంత భాగాన్ని ఆసుపత్రికి దానంగా ఇస్తే.. ఈ గ్రామానికి వారు చేసిన మేలు తరతరాలకు చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. మంచికైనా, చెడుకైనా మన ఊరి ఆసుపత్రి మన ఊరిలోనే ఉండాలి కాబట్టి సంఘ నాయకులు పునరాలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే ఊరి భవిష్యత్తు కోసం, ప్రాణదానం లాంటి ఈ సత్కార్యం కోసం ఇంకెవరైనా దాతలు భూదానం చేయడానికి అనుకూలంగా ఉంటే దయచేసి ముందుకు రావాలని చల్లసముద్రం ప్రజలందరూ ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు.




