- అక్షరమే ఆయుధంగా..ఆశయమే ఊపిరిగా:ఉత్తమ అధ్యాపకుడు ‘బాణోత్ జుంకీలాల్’

ఖమ్మం జిల్లా బ్యూరో పరివర్తన అవాజ్ న్యూస్ జనవరి 27
ఖమ్మం గడ్డపై మెరిసిన అక్షర శిఖరం:
నిరుపేద గిరిజన గూడెం నుంచి వచ్చి, నేడు వందలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న అక్షర యోధుడు శ్రీ బాణోత్ జుంకీలాల్.సింగరేణి మండల గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల తెలుగు అధ్యాపకుడిగా ఆయన చేస్తున్న సేవలు నేడు జిల్లా గర్వించే స్థాయికి చేరాయి.77వ గణతంత్ర దినోత్సవ వేళ,ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చేతుల మీదుగా ఆయన అందుకున్న “జిల్లా ఉత్తమ అధ్యాపక అవార్డు” ఆయన కష్టానికి దక్కిన అసలైన గౌరవం.
జుంకీలాల్ గారి ప్రస్థానం సామాన్యమైనది కాదు. ఆకలి తెలిసిన పేదరికం నుంచి వచ్చినా, అక్షరంపై ఉన్న మమకారం ఆయన్ని కుంగదీయనివ్వలేదు. “తాను పడ్డ కష్టం తన విద్యార్థులు పడకూడదు” అనే సంకల్పంతో, ప్రతి విద్యార్థిని ఒక ఆణిముత్యంలా తీర్చిదిద్దుతున్నారు. కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమే తన జీవిత లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు.
జుంకీలాల్ మా కళాశాల గర్వకారణం” అంటూ ప్రిన్సిపాల్ జి. హరికృష్ణ ఆయనను కొనియాడారు. ఆయన నిబద్ధత ఇతర అధ్యాపకులకు ఒక దిశానిర్దేశం అని పేర్కొన్నారు.ఈ విజయోత్సవంలో వైస్ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు,అధ్యాపకులు పావణి,ప్రవీణ, సుమన్,చంద్రరేఖ,వనిత,రామారావు తదితరులు పాల్గొని జుంకీలాల్ గారిని ఘనంగా సన్మానించారు.
