–తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయాణ
పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్, తెలంగాణ రాష్ట్రం అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ మరియు జనరల్ సెక్రటరీ నవూరి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్కు చెందిన న్యాయవాది శ్రీ మహమ్మద్ ఖదీర్ గారి దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన న్యాయవృత్తి గౌరవానికి, న్యాయపాలనకు, న్యాయవ్యవస్థకు నేరుగా జరిగిన దాడిగా పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 16-02-2026 సోమవారం నాడు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించాలని ఫెడరేషన్ నిర్ణయించినట్లు తెలిపారు. అదే రోజు ఉదయం 10:30 గంటలకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్లలో సంతాప సమావేశాలు నిర్వహించబడతాయని చెప్పారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి కోర్టు ప్రధాన ద్వారాల ముందు శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టి, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వం వెంటనే నిందితులను అరెస్ట్ చేసి, వేగవంతమైన మరియు నిష్పక్షపాత విచారణ జరిపి, దోషులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. అలాగే న్యాయవాదుల రక్షణ కోసం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను తక్షణమే అమలు చేయాలని కోరారు.
అలాగే మంగళవారం రోజు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని బార్ అసోసియేషన్ల అధ్యక్షులు, కార్యదర్శులతో కలిసి న్యాయవాదుల రక్షణ చట్టం అమలు కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్లు, న్యాయవాదులు ఈ నిరసన కార్యక్రమంలో పూర్తిస్థాయిలో పాల్గొని ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు.
