పోలింగ్ సమయం ముగిసినా క్యూలో ఉన్న ప్రతి ఓటరికి అవకాశం : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్
అరివర్తన్ అవాజ్,కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 73.33 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలోని మూడు అర్బన్ లోకల్ బాడీల పరిధిలో మొత్తం 106 వార్డులు, 288 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.
జిల్లాలో మొత్తం 1,85,348 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 88,738 మంది, మహిళలు 96,572 మంది, ఇతరులు 38 మంది ఉన్నట్లు వివరించారు. సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 1,35,910 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.
అశ్వరావుపేట మున్సిపాలిటీలో మొత్తం 16,850 మంది ఓటర్లలో 12,839 మంది (76.20%) ఓటు హక్కు వినియోగించుకోగా, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,34,775 మంది ఓటర్లలో 99,992 మంది (74.19%) ఓటు వేశారు. యెల్లందు మున్సిపాలిటీలో 33,723 మంది ఓటర్లలో 23,079 మంది (68.44%) ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు.
పోలింగ్ సమయం సాయంత్రం 5 గంటలకు ముగిసినప్పటికీ, అప్పటికే పోలింగ్ కేంద్రాల లోపల క్యూలో నిలుచున్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
పోలింగ్ ప్రక్రియ పూర్తైన వెంటనే బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సంబంధిత స్ట్రాంగ్ రూములకు తరలించడం జరుగుతుందని తెలిపారు. స్ట్రాంగ్ రూముల వద్ద తగిన భద్రతా సిబ్బందిని నియమించి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని వెల్లడించారు.
