పరివర్తన అవాజ్:-కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 18వ డివిజన్లో రాజకీయ ఉత్సాహం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తరఫున 18వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా మాతంగి దివ్యకు పార్టీ అధిష్టానం అధికారికంగా బీఫామ్ అందజేసింది. ఈ బీఫామ్ను డిసిసి అధ్యక్షురాలు దేవి ప్రసన్న మరియు ఐవైసీ అధ్యక్షుడు చీకటి కార్తీక్ అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాతంగి దివ్యకు బీఫామ్ అందజేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు. 18వ డివిజన్లో ఉన్న ప్రతి ప్రజా సమస్యను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని ఆమె హామీ ఇచ్చారు.
డివిజన్ పరిధిలో తాగునీటి సమస్య, రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ, శానిటేషన్, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని దివ్య వెల్లడించారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా సేవలందిస్తానని, ప్రతి ఇంటి సమస్య తన సమస్యగా భావించి పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
అలాగే 18వ డివిజన్ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని దివ్య అన్నారు. తాను విజయం సాధిస్తే డివిజన్లో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తానని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో తనకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని డివిజన్ ప్రజలను ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని మాతంగి దివ్యకు అభినందనలు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
