
పరివర్తన అవాజ్,కొత్తగూడెం టౌన్ :-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం డీఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎల్. ఆదినారాయణను శనివారం టైక్వాండో జిల్లా కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇనీగాల మొగిలి ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
గతంలో కొత్తగూడెం త్రీటౌన్ సీఐగా విధులు నిర్వహించిన అనుభవంతో పోలీస్ శాఖలో మంచి గుర్తింపు, మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. అదే తరహాలో కొత్తగూడెం డీఎస్పీగా కూడా ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ ఎల్. ఆదినారాయణ మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, ముఖ్యంగా కొత్తగూడెంలో అనేకమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని తెలిపారు. క్రీడలంటే తనకు ప్రత్యేక మక్కువ ఉందని, క్రీడాకారులకు ఎలాంటి సహాయ-సహకారాలు అవసరమైనా పోలీస్ శాఖ తరఫున ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ప్రధానంగా యువత క్రీడల్లో రాణించాలని, మత్తుపదార్థాలకు దూరంగా ఉండి శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలని సూచించారు. క్రీడల్లో ప్రతిభ చూపించి జిల్లా ఖ్యాతిని మరింత ఇనుముడింపజేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టైక్వాండో అసోసియేషన్ సభ్యులు సీహెచ్. రెడ్డి, దొంగ రమేష్, అడ్వకేట్ ఉప్పరి శ్రీనివాసరావు, వేలేటి వెంకటేశ్వర్లు, కౌడగాని మహేష్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
