ఆరు గ్రామపంచాయతీల రైతు సమన్వయ కమిటీ చారిత్రక నిర్ణయాలు: రైతులకు ఆర్థిక ఊరట!
పరివర్తన అవాజ్ చల్లసముద్రం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని ఉమ్మడి చల్లసముద్రం మరియు మామిడి గుండాల గ్రామపంచాయతీలలోని ఆరు గ్రామపంచాయతీల రైతు సమన్వయ కమిటీ రైతుల సంక్షేమం కోసం కీలక, చారిత్రక నిర్ణయాలు తీసుకుంది. ఎంతో కాలంగా వ్యాపారస్తులు(ధాన్యం కొనుగోలుదారులు) బస్తాకు తీసుకుంటున్న 72 కేజీల బరువును 71 కేజీలుగా నిర్ణయించడం జరిగింది, హమాలీ కూలీల విషయంలోనూ రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. గతంలో క్వింటాల్కు రూ. 85 తీసుకున్న ఛార్జీని రూ. 75 కు నిర్ణయించారు(రైతు కొనుగోలు కేంద్రం వద్ద మాత్రమే).వ్యాపారస్తుల (స్థానిక కొనుగోలుదారుల )వద్ద పాత ధర వర్తిస్తుంది. దీనితో పాటు, అన్ని పంటలపై ‘బిక్షం’ పేరుతో గతంలో వసూలు చేసిన 20 నుంచి 30 కేజీల అదనపు ధాన్యాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. కమిటీ తీసుకున్న ఈ రైతు అనుకూల నిర్ణయాలకు కృతజ్ఞతగా, రైతులు కమిటీ గౌరవ అధ్యక్షుడు ధనియాకుల బాబుకి మరియు కమిటీ అధ్యక్షుడు ఎల్లంపల్లి బుచ్చయ్యకి వారు చేస్తున్న నిస్వార్థ కృషికి ఘనంగా సన్మానం చేశారు. మరోవైపు, వరి కోత మిషన్ల యజమానులు మరియు రైతులకు మధ్య జరగాల్సిన సమావేశం, కొంతమంది మిషన్ యజమానులు అనివార్య కారణాల వల్ల హాజరు కాకపోవడంతో రెండు రోజులు వాయిదా పడింది. భవిష్యత్తులో ఈ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించబోతుందని, తొందర్లో సంఘం రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేయించడం జరుగుతుందని ఆరు పంచాయతీల రైతు సమన్వయ కమిటీ ఈ సందర్భంగా తెలియజేసింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎల్లంపల్లి బుచ్చయ్య, ఆరు పంచాయతీల రైతు సమన్వయ కమిటీ సభ్యులు మరియు స్థానిక రైతులు, వరి కోత మిషన్ యజమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



