పరివర్తన అవాజ్,కొత్తగూడెం19వ డివిజన్ పరిధిలోని అర్హులైన గర్భిణీ స్త్రీలకు ఉచిత డెలివరీ సేవలు అందించబడనున్నాయని 19వ డివిజన్ కార్పొరేటర్ స్వప్న శంకర్ నాయక్ వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల సరైన వైద్యసేవలు పొందలేకపోతున్న గర్భిణీలకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
సోమవారం చుంచుపల్లి మండలం విద్య నగర్ కాలనీ లో గల న్యూ లైఫ్ హాస్పిటల్లో చిట్టి రామవరం తండకు చెందిన భూక్య వెన్నెలకు పూర్తిగా ఉచితంగా సురక్షిత డెలివరీ నిర్వహించామని పేర్కొన్నారు. తల్లి–శిశు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన వైద్యసేవలను అందిస్తున్నట్లు తెలిపారు.
ఆర్థికంగా బలహీన వర్గాలు, గిరిజన ప్రాంతాల మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని స్పష్టం చేశారు. అవసరమైన గర్భిణీలు ముందస్తుగా సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల సంక్షేమం కోసం వైద్య సేవలను మరింత విస్తరించేందుకు కృషి కొనసాగుతుందని, ప్రతి ఇంట్లో ఆరోగ్యకరమైన తల్లి–ఆరోగ్యవంతమైన శిశువు ఉండాలని ఆకాంక్షిస్తున్నామని స్వప్న శంకర్ నాయక్ తెలిపారు. 19వ డివిజన్ ప్రజలందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
