
పరివర్తన అవాజ్, కొత్తగూడెం:–విద్యానగర్ కాలనీ చింతలచెరువు సమీపంలో ఉన్న బతుకమ్మ ఘాటు వద్ద మరియు దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శాంతి శ్రీ, ఉపసర్పంచ్ వాసిరెడ్డి మురళి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది.
ఈ సందర్భంగా ఘాటు ప్రాంతంలో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర అనవసర పదార్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. బతుకమ్మ పండుగ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే నేపథ్యంలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
సర్పంచ్ శాంతి శ్రీ మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సహకరించాలని కోరారు. ఉపసర్పంచ్ వాసిరెడ్డి మురళి మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.
ఈ శుభ్రత కార్యక్రమంలో గ్రామపంచాయతీ సభ్యులు, పారిశుధ్య సిబ్బంది, స్థానికులు పాల్గొని తమ వంతు సహకారం అందించారు.
