పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ పరిధిలోని రామవరం ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోరే రమేష్ కుమార్ ఆరోపించారు. గత ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వ మిషన్ భగీరథ పథకం కింద దాదాపు రూ.3 కోట్లతో, అలాగే కేంద్ర ప్రభుత్వ జల్ యోజన పథకం కింద రూ.8 కోట్ల వ్యయంతో ఎనిమిది లక్షల లీటర్ల సామర్థ్యం గల భారీ వాటర్ ట్యాంక్ నిర్మించినప్పటికీ, ఇప్పటివరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదని విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికలు జరిగి 28 నెలలు గడిచినా, రామవరం పరిధిలోని దాదాపు ఆరు డివిజన్ల ప్రజలకు సరైన మంచినీటి సౌకర్యం లేకపోవడం విచారకరమని అన్నారు. ముఖ్యంగా వేసవికాలం ప్రారంభమైన ఈ సమయంలో కూడా పూర్తయిన వాటర్ ట్యాంకులను ప్రారంభించకుండా పైపులైన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
ప్రస్తుతం రామవరం ప్రజలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని, అధికారులు మరియు స్థానిక శాసనసభ్యులు వెంటనే స్పందించి పూర్తయిన వాటర్ ట్యాంకులను వినియోగంలోకి తీసుకువచ్చి ప్రజలకు తాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
లేదంటే రాబోయే రోజుల్లో రామవరం ప్రాంత ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని కాంగ్రెస్ పార్టీ తరఫున మోరే రమేష్ కుమార్ హెచ్చరించారు.
