
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి
జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఏర్పాటు చేసిన నేర సమీక్షా సమావేశంలో జిల్లా పోలీస్ అధికారులతో ఎస్పీ
పరివర్తన అవాజ్,కొత్తగూడెం
జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు ఎస్పీ రోహిత్ రాజు జిల్లాలోని పోలీసు అధికారులతో సోమవారం నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులందరూ బాధ్యతగా తమ విధులు నిర్వర్తించాలని సూచించారు.ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల నియమావళిని అనుసరించి పటిష్టమైన ప్రణాళికను తయారు చేసుకోవాలని సూచించారు ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ర్యాలీలు,సభలకు అనుమతి తీసుకోవడం తప్పనిసరని,ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తప్పవని తెలిపారు.
పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న పలు కేసుల ఫైళ్లను ఎస్పీ స్వయంగా పరిశీలించారు.న్యాయాధికారులతో సమన్వయంతో కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు.ప్రజలు సైబర్ క్రైమ్స్ బారిన పడి తమ డబ్బును కోల్పోకుండా,నిత్యం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.రౌడీ షీటర్లు మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు.గంజాయి రవాణా,మట్కా,పేకాట,కోడి పందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.గంజాయి హాట్ స్పాట్స్ నందు నిత్యం పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎర్రైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఫోక్సో కేసుల్లోని నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా కృషి చేయాలన్నారు.
ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,ఇల్లందు డిఎస్పి చంద్రభాను,మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి,సైబర్ క్రైమ్స్ డిఎస్పీ అశోక్ మరియు సిఐలు,ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.
