సమస్యలపై పోరాటం వాటి పరిష్కారమే సిపిఐ ధ్యేయం
వందేళ్ల స్పూర్తితో బలమైన ఉద్యమాలు
సిపిఐ శత వసంత ఉత్సవ ముగింపు సభను జయప్రథం చేయండి
ఖమ్మంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ
పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం
సిపిఐ శత వసంతాల సాక్షిగా సమస్యలపై పోరాటం, వాటి పరిష్కారమే ధ్యేయంగా మరో వందేళ్లు కూడా ముందుకు
సాగుదామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం కార్పోరేషన్ కార్యదర్శులు, పట్టణ కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు, మాజీ కౌన్సిలర్ల అత్యవసర సమావేశం స్థానిక శేషగిరి భవన్, సిపిఐ కార్యాలయంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ దేశ స్వతంత్రానికంటే ముందే భారత గడ్డపై ఆవిర్భవించిన సిపిబ వందేళ్లు పూర్తి చేసుకుందన్నారు. బ్రిటీష్ బానిస సంకెళ్ల నుండి దేశాన్ని విముక్తి చేసేందుకు సిపిఐ రాజీలేని పోరాటం చేసిందని, ఈ మహా సంగ్రామంలో ఎందరో కమ్యూనిస్టు యువకిశోరాలు రక్త తర్పణం చేశారని చెప్పారు. భూమి కోసం భుక్తి కోసం నిరంకుశ నిజాంను గద్దెదింపేందుకు జరిగిన మహాత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నరవేల మంది ప్రాణ త్యాగాలు చేశారని, వేలాది గ్రామాలు విముక్తి పొందగా, పది వేల ఎకరాల భూమిని పంచిన చరిత్ర సిపిఐకు ఉందని, అదే విధంగా తెలంగాణ మలిదశ పోరాటంలో సిపిఐ పెద్దన్న పాత్ర పోషించిందన్నారు. నాటి నుండి నేటి వరకు అదే పోరాట పటిమతో సిపిఐ వందేళ్లుగా ముందుకు సాగుతోందని, రానున్న శత వసంతం కూడా ప్రజలు, కార్మికులు, కర్షకులు, రైతులు, వ్యవసాయ కూలీలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఉత్తేజ పూరితంగా ముందడుగు వేద్దామన్నారు. దేశంలో అధికారాన్ని అనుభవిస్తున్న బిజేపి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి కషాయికరణ వైపు వేగంగా అడుగులేస్తోందని, హిందుత్వ ఎజెండాతో
ముందుకు సాగుతూ మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుకుంటోందన్నారు. మోడి సర్కార్ నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు కట్టబెడుతూ దేశ సంపదను కారు చౌకగా అదానీ, అంబానీ లాంటి కార్పోరేట్ దారుల చేతుల్లో పెడుతూ దేశాన్ని పేదరికం వైపుకు పరుగులు తీయిస్తోందన్నారు. సింగరేణిని ప్రైవేటీ కరణ చేసేందుకు చూస్తోందని, బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టి దశాబ్దాల చరిత్ర గల సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు చూస్తోందని మండిపడ్డారు. దేశంలోని సబ్బండ వర్గాల ప్రజానికాన్ని కట్టుబానిసలుగా మార్చేందుకు చూస్తున్న బిజేపి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, ఇందు కోసం కమ్యూనిస్టులు ఐఖ్యత, వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐఖ్యత అనివార్యమని చెప్పారు. ఈనెల 18న ఉద్యమాల పురిటిగట్ట ఖమ్మం కేంద్రంగా సిపిఐ శత వంసత ఉత్సవాల ముగింపు సభ ఐదు లక్షల మందితో వైభవంగా జరగనుందని, 40 దేశాల నుండి కమ్యూనిస్టు ప్రతినిధులు తరలి వస్తున్నారని చెప్పారు. కమ్యూనిస్టులకు పస తగ్గిందంటూ నోళ్లు పారేసుకుంటున్న వారికి కనీవినీ ఎరుగని రీతిలో జరిగే ఈ శత వసంత సభ కనువిప్పు కానుందని, ఈ సభను విజయవంతం చేసేందుకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. త్వరలో కార్పోరేషన్ ఎన్నికలు జరగనున్నాయని, నూతనంగా ఏర్పాటైన కొత్తగూడెం కార్పోరేషన్కు జరిగే ఎన్నికల్లో సిపిఐ విజయం సాధించేందుకు ఆయా డివిజన్ల కార్యదర్శులు, మాజీ కౌన్సిలర్లు ఇప్పటి నుండే కృషి చేయాలని, ప్రజలతో మమేకమై చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని, గెలుపై లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ ఎన్నికల్లో స్థానిక పరిస్థితులు, స్థితిగతుల = దృష్ట్యా కలిసివచ్చే వారితో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. జిల్లా కార్యవర్గసభ్యులు కంచర్ల జమలయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గెద్దాడు నగేష్, మునిగడప వెంకటేశ్వర్లు, మాచర్ల శ్రీనివాస్, బోయిన విజయ్ కుమార్, సత్యనారాయణా చారి, బండి నర్సింహా, గుమ్మడెల్లి దుర్గ, పల్లపోతు సాయి కుమార్, పైడిపెల్లి లక్ష్మీ, కైసర్, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
