పరివర్తన అవాజ్,కొత్తగూడెం
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా “పిల్లల భద్రత – డ్రగ్స్కు అడ్డుకట్ట, డ్రగ్స్ రహిత తెలంగాణ మన అందరి బాధ్యత” అనే నినాదంతో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రామవరం ప్రాంతానికి చెందిన ప్రజలు, యువకులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మానవహారం ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని నినాదాలు చేస్తూ యువతలో చైతన్యం కల్పించారు. అనంతరం డ్రగ్స్కు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేశారు.
- రామవరం గణేష్ టెంపుల్ చమన్ వద్ద జరిగిన అవగాహన సదస్సులో 2 టౌన్ సీఐ డి. ప్రతాప్ మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో యువత మత్తు పదార్థాలకు బానిసవుతున్న పరిస్థితి ఆందోళనకరమని అన్నారు. డ్రగ్స్ వల్ల వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజం కూడా తీవ్రంగా నష్టపోతాయని తెలిపారు. యువత మంచి లక్ష్యాలతో ముందుకు సాగి దేశ అభివృద్ధికి తోడ్పడాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
- ఈగల్ టీం ఇన్స్పెక్టర్ రవీందర్ మాట్లాడుతూ డ్రగ్స్ రకాల గురించి, వాటిని ఎలా గుర్తించాలో వివరించారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మత్తు పదార్థాల వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతింటున్నాయని తెలిపారు.
- కార్యక్రమం అనంతరం పోలీసుల తరఫున పిల్లలకు క్రికెట్ బ్యాట్లు, బాల్స్ మరియు క్రీడా కిట్లు అందజేశారు. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని, క్రీడలు మానసిక ధైర్యాన్ని పెంచడంతో పాటు మెదడు చురుకుదనాన్ని పెంపొందిస్తాయని పోలీసులు సూచించారు.
- ఈ అవగాహన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు, పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్, హైస్కూల్ హెడ్మాస్టర్, అంగన్వాడీ టీచర్లు, మహిళలు, యువకులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- “స్వచ్ఛమైన సమాజం – సురక్షిత భవిష్యత్తు కోసం డ్రగ్స్కు నో చెప్పాలి” అని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
