
పరివర్తన అవాజ్:-చర్ల మరియు సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నమోదవుతున్న జ్వర కేసుల నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DMHO) సంబంధిత సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జ్వర కేసుల నియంత్రణపై పలు కీలక సూచనలు జారీ చేశారు. నమోదైన ప్రతి జ్వర కేసును ప్రతిరోజూ సర్వే చేసి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ మరియు మలాథియన్ టెక్నికల్ ఫాగింగ్ను నాలుగు వారాల పాటు నిర్దిష్ట వ్యవధుల్లో నిర్వహించాలని సూచించారు.
రోజువారీ జ్వర సర్వేలను సమగ్రంగా పర్యవేక్షించే బాధ్యత సూపర్వైజింగ్ అధికారికి (SUO) ఉంటుందని, స్ప్రేయింగ్ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావాలని తెలిపారు. ప్రతి గ్రామం మరియు ఇంటింటికీ చేరుకునేలా హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు.
ఏ గ్రామంలోనైనా ఒక్క జ్వర కేసు గుర్తించినా, ఆ గ్రామంలో మరిన్ని కేసులు రాకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం “డ్రై డే” కార్యక్రమాలను ఆశా కార్యకర్తలు తప్పనిసరిగా నిర్వహించి, సర్వే ఫారమ్ను పూర్తి చేయాలని సూచించారు.
ఈ సర్వే ఫారమ్లో ఎన్సీడీ, ఈసీ, టీసీ, ఏఎన్సీ, పీఎన్సీ, ఎస్ఏఎం, ఎమ్ఏఎం, బాలల టీకాలు, విటమిన్–ఏ పంపిణీ, కుటుంబ నియంత్రణ ప్రోత్సాహం తదితర ఆరోగ్య కార్యక్రమాల వివరాలు నమోదు చేయాలని తెలిపారు.
అనంతరం డీఎంహెచ్ఓ CHC చర్లను సందర్శించి వార్డులు, ఆపరేషన్ థియేటర్ మరియు ప్రసూతి వార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలు సేకరించారు.
జ్వర కేసులపై సమీక్ష నిర్వహించి, అందిస్తున్న చికిత్స విధానాలపై CHC వైద్యులతో చర్చించారు. మలేరియా మందుల లభ్యతను పరిశీలించగా తగినంత నిల్వ అవసరమని గుర్తించారు.
విషప్రయోగం మరియు పాము కాటు కేసుల నిర్వహణపై విచారించి, సంబంధిత అత్యవసర మందుల లభ్యతను వైద్యులతో నిర్ధారించుకున్నారు. తగినంత మలేరియా మందుల నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని మరియు దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర మలేరియా అదనపు డైరెక్టర్ గారికి లేఖ రాయాలని పోగ్రాం ఆఫీసర్ (మలేరియా)కు ఆదేశించారు.
అలాగే డీఎంహెచ్ఓ, పిహెచ్సీ జూలూరుపాడు మరియు సుజాతనగర్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్పర్శ్ లెప్రసీ అవగాహన కార్యక్రమాల భాగంగా సుజాతనగర్ పాఠశాలలో విద్యార్థులకు కుష్ఠు వ్యాధిపై అవగాహన కల్పించి, అనంతరం ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. శ్రీధర్, పోగ్రాం ఆఫీసర్ (మలేరియా) డా. స్పందన , పిహెచ్సీ వైద్యాధికారులు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
