
ఏజెన్సీ ఎస్సీ రిజర్వేషన్ పెంపు పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -మోదుగు జోగారావు
పరివర్తన అవాజ్ కొత్తగూడెం:
కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవిని ఎస్సీలకు కేటాయించాలని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోదుగు జోగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఎస్సీల ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత, అదే ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీలు లేరన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఏజెన్సీ రిజర్వేషన్ పెంపు అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా పరిగణించాలన్నారు. ఇప్పటికైనా ఎస్సీ వర్గాలకు న్యాయం చేసి, నామినేట్ పదవుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవిని ఎస్సీలకు కేటాయించాలని స్పష్టం చేశారు.
లేనిపక్షంలో ఎస్సీ వర్గాల హక్కుల కోసం ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసినట్లు తెలిపారు.
