
బరిలోకి యువ నాయకుడు గుగులోత్ శ్రీకృష్ణ
పరివర్తన అవాజ్,కొత్తగూడెం
మంగపేట, వేపలగడ్డ, నరసింహసాగారం సహా మూడు గ్రామాలు పంచాయతీ పరిధి నుండి తాజాగా కార్పొరేషన్ లో 23వ డివిజన్ గా ఏర్పడిన తరవాత జరిగే మొదటి ఎలక్షన్ కాగా, కొత్తగూడెం కార్పొరేషన్ నేపథ్యంలో, ఆ డివిజన్ నుంచి యువకుడు గుగులోత్ శ్రీకృష్ణ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
మంగపేట నివాసి, విద్యావంతుడు, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న సోషల్ వర్కర్ అయిన గుగులోత్ శ్రీకృష్ణ, ప్రజలకు మంచి చేసే నాయకుడిగా, అన్యాయాన్ని ప్రశ్నించే యువకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే తన లక్ష్యమని తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 23వ డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికల బరిలో నిలవడం ఖాయమని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోటీ నుంచి వెనక్కి తగ్గేది లేదని ధీమా వ్యక్తం చేశారు.
తాను ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేయనున్నది త్వరలోనే భవిష్యత్ కార్యాచరణతో పాటు ప్రకటిస్తానని తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే యువ నాయకుడిగా తనకు అవకాశం ఇవ్వాలని డివిజన్ ప్రజలను కోరారు.
యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్న గుగులోత్ శ్రీకృష్ణ నిర్ణయంతో 23వ డివిజన్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
