“125 పథకం” ఇందిరమ్మ రాజ్యంలోనే మాయం?”
పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం
ప్రాంతాల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పలువురు కుటుంబాలు కరెంటు మీటర్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంవత్సరాలుగా దరఖాస్తులు చేసుకున్నా, అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
విద్యార్థులు చదువులకు ఇబ్బంది పడుతున్నారని, చిన్న వ్యాపారాలు చేసుకునే వారు కూడా విద్యుత్ కనెక్షన్ లేక ఆదాయం కోల్పోతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీల సమస్యలపై స్పందించని (ఎన్పీడీసీఎల్) అధికారుల వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల ప్రకటించిన “125 పథకం” కూడా ఎస్సీలకు అందకుండా, కేవలం కాగితాలపైనే మిగిలిపోయిందని ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రచారం చేసిన ప్రభుత్వం, ఎస్సీల మౌలిక అవసరమైన విద్యుత్ సౌకర్యం కూడా కల్పించలేకపోతే అది ఏ రాజ్యం అని ప్రశ్నలు వేస్తున్నారు.
ఈ విషయంపై స్పందించిన తెలంగాణ దివ్యాంగుల సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వీర రవీంద్రనాథ్, వెంటనే 125 పథకాన్ని అమలు చేసి అర్హులైన ఎస్సీ కుటుంబాలకు ఉచితంగా కరెంటు మీటర్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఎస్సీ వర్గాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగితే, సామాజిక న్యాయం కేవలం మాటలకే పరిమితమవుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా? లేక ఎస్సీల సమస్యలు ఇంకా చీకట్లోనే మిగిలిపోతాయా?
