పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక జిడబ్ల్యూఎంసి సెప్టెంబర్ 19.
హన్మకొండలోని కరీంనగర్ ప్రధాన రహదారి కిట్స్ కళాశాల జంక్షన్ అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టీ. వెంకన్న అధికారులను ఆదేశించారు.శనివారం కమిషనర్ జంక్షన్ అభివృద్ధి చేయనున్న ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని రోడ్డు విస్తరణ పనులతో పాటు ఫుట్పాత్లు, ఐలాండ్ల ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్డు అభివృద్ధి, జంక్షన్ సుందరీకరణ తదితర పనులను సమగ్రంగా చేపట్టాలని సూచించారు.టెండర్ ప్రక్రియ పూర్తైనందున ఎలాంటి జాప్యం లేకుండా పనులను ప్రారంభించి, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. జంక్షన్ అభివృద్ధితో వాహనదారులు, పాదచారులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రాంతానికి మరింత ఆకర్షణీయమైన రూపాన్ని తీసుకురావాలని సూచించారు.ఈ పరిశీలనలో కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ రాజ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.



