ట్రాన్స్జెండర్లకు ఆర్థిక పునరావాసం – రూ.75 వేల చొప్పున చెక్కుల పంపిణీ
కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చేతుల మీదుగా రెండు యూనిట్ల లబ్ధిదారులకు సహాయం
{కామారెడ్డి, అవాజ్ న్యూస్}: ట్రాన్స్జెండర్ వర్గాల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో భాగంగా కామారెడ్డి జిల్లాకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక పునరావాస పథకం కింద రెండు యూనిట్లను మంజూరు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చేతుల మీదుగా ఇద్దరు ట్రాన్స్జెండర్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.75,000 చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం తమ జీవితాల్లో స్థిరత్వం తీసుకురావడంలో కీలకంగా ఉపయోగపడుతుందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఏ. ప్రమీల, సూపరింటెండెంట్ అరుణ్ భాస్కర్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
