ప్రాంగణ నియామకాల్లో 12 మంది విద్యార్థులు ఎంపిక
(పరివర్తన ఆవాజ్ కామారెడ్డి ). ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల కామారెడ్డిలో టి యస్ కె సి మరియు ఫీజికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ” జూమ్ గ్రూప్ మరియు సైబర్ సెంటినల్ ” బహుళజాతి కంపెనీల కొరకు సోమవారం నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 12 మంది కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డా కె విజయ్ కుమార్ తెలిపారు .
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, నేటి తీవ్ర పోటీ ప్రపంచంలో బహుళజాతి సంస్థలు స్వయంగా గ్రామీణ ప్రాంతాల కళాశాలలకు వచ్చి ప్రాంగణ నియామకాలు నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ముఖ్యంగా కామారెడ్డి వంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ కళాశాలను ఎంపిక చేయడం సంస్థల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రతిభ, పట్టుదల, కృషిలో ఎలాంటి లోటు లేకుండా పట్టణ ప్రాంత విద్యార్థులతో మరింత మెరుగ్గా రాణిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని, మరింత ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని సూచించారు.
కంపెనీ ప్రతినిధి నోబెల్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న డిగ్రీ విద్యార్థులు సిద్ధాంతపరంగా మాత్రమే కాక ప్రాక్టికల్ నైపుణ్యాల్లో కూడా ముందంజలో ఉన్నారని తెలిపారు. పట్టణ విద్యార్థులతో పోల్చితే గ్రామీణ విద్యార్థుల్లో క్రమశిక్షణ, కృషి, నేర్చుకోవాలనే తపన ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాలకు వచ్చి నేరుగా ప్రతిభను గుర్తించి అవకాశాలు కల్పించడం తమ సంస్థ విధానమని చెప్పారు.
భవిష్యత్తులో కూడా ఈ కళాశాలతో కలిసి మరిన్ని నియామక కార్యక్రమాలు నిర్వహించాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు.
ఈ ప్రాంగణ నియామక ప్రక్రియలో రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థులను ఎంపిక చేశారు. ఎంపికైన 12 మంది విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం అభినందిస్తూ, వారి కుటుంబాలకు మరియు కళాశాలకు గౌరవం తీసుకువచ్చారని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో అకడమిక్ సమన్వయకర్త డా విశ్వప్రసాద్ , అధ్యాపకులు డా శ్రీనివాస రావు ,జయ ప్రకాష్ ,రాజేందర్ టి యస్ కె సి కో ఆర్డినేటర్ రాజా గంభీర్ రావు , ఫర్హీన్ ఫాతిమా టి యస్ కె సి మెంటర్ అజహారోద్దిన్ కంపెనీ ప్రతినిధులు నోబెల్ ,శ్రీనివాస్ పాల్గొన్నారు



