మోడల్ ఫామ్ షెడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 23, బూర్గంపాడు మండలంలోనిమొరంపల్లి బంజార గ్రామంలో సమీకృత వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే దిశగా మోడల్ ఫామ్ షెడ్ నిర్మాణ పనులను కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల ఆర్థికాభివృద్ధి దిశగా వ్యవసాయ ఆధారిత అనుబంధ రంగాలను సమీకరించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. రైతులు కూరగాయల సాగుతో పాటు బంతిపువ్వులు, కొర్రమీను చేపల పెంపకం, కౌజు పిట్టల పెంపకం మరియు మేకల పెంపకం వంటి పలు రంగాలను ఒకే ఆవరణలో నిర్వహించడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చని తెలిపారు.మోడల్ ఫామ్ షెడ్ నిర్మాణం సమీకృత వ్యవసాయం యొక్క ప్రాతినిధ్య మోడల్గా నిలుస్తుందని, ఈ ప్రాజెక్ట్ను ప్రతి మండలంలో అమలు చేయాలన్న లక్ష్యంతో మొరంపల్లి బంజార గ్రామంలో ప్రారంభించినట్లు కలెక్టర్ వివరించారు. నిర్ణీత ప్రణాళిక ప్రకారం ప్రతి షెడ్లో చేపల పెంపకం, కౌజు పిట్టల పెంపకం, మేకల పెంపకం వంటి రంగాలను సమన్వయంగా అభివృద్ధి చేయడంతో పాటు షెడ్డు పరిసరాల్లో కూరగాయలు, పూలు సాగు చేసి రైతులు మరింత లాభదాయకమైన ఆదాయాన్ని పొందగలరని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా పలుగు చేతపట్టి షెడ్ నిర్మాణానికి గుంతను తవ్వి పనులను ప్రారంభించారు. అనంతరం మోడల్ ఫామ్లో ఇప్పటికే సాగులో ఉన్న కూరగాయలు, బంతిపువ్వుల పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. సమీకృత వ్యవసాయ పద్ధతులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తాయని, ముఖ్యంగా యువ రైతులు ఈ పద్ధతులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఇలాంటి మోడల్ ఫామ్ షెడ్లను ఏర్పాటు చేయడం ద్వారా రైతులు వీటి గురించి అవగాహన పొంది, తమ గ్రామాల్లో కూడా ఈ విధానాలను అమలు చేయడం ద్వారా ఆదాయ వనరులను విస్తరించగలరని కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం అవసరమైన అవగాహన కార్యక్రమాలు, శిక్షణ శిబిరాలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.డీ.ఏ ఈసీ రాజు, ఏపీఓ వెంకయ్య, ఉపాధి హామీ పథకం ఏపీఓ, ఐకెపి ఏపీఎం, పంచాయతీ సెక్రటరీ, టెక్నికల్ అసిస్టెంట్, మహిళా సమాఖ్య సభ్యులు త
దితరులు పాల్గొన్నారు

