జూబ్లీహిల్స్లో పోరు ముదురుతోంది — ప్రజల మద్దతు బీఆర్ఎస్కేనని కేటీఆర్ వ్యాఖ్యలు
- (హైదరాబాద్, అక్టోబర్13 – ఆవాజ్ న్యూస్) జూబ్లీహిల్స్ రాజకీయ రంగంలో బీఆర్ఎస్ శక్తిని చూపించడానికి సిద్దమైందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రహమత్నగర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల మద్దతు, న్యాయం, ధర్మం అన్నీ బీఆర్ఎస్ వైపునే ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ ప్రజలు రేవంత్ రెడ్డి రాజకీయాలు బాగా తెలుసుకొని గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన ప్రజలు కూడా ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారని వ్యాఖ్యానించారు.
ముస్లింలకు ప్రాతినిధ్యం ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. అజారుద్దీన్ను ఎమ్మెల్సీ చేస్తామని చెప్పి కేవలం కాగితం మీదే చూపించి మోసం చేశారని ఆరోపించారు. షేక్పేట కబరస్థాన్కు కేటాయించిన భూమి కూడా కోర్టులో నిలబడదని, బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు.
ప్రజలను మోసం చేయడం రేవంత్ ప్రభుత్వానికి అలవాటైందని విమర్శిస్తూ, ప్రజలు ఈ సారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బలమైన తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు — పెన్షన్ పెంపు, మహిళలకు నెలకు రూ. 2,500, నిరుద్యోగ భృతి వంటి వాటిని గుర్తుచేస్తూ, ఇవన్నీ ‘ప్రజల బాకీలు’గా మార్చిందని పేర్కొన్నారు. ఈ బాకీ కార్డును ప్రజల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని కేటీఆర్ స్పష్టం చేశారు
