భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెప్టెంబర్ 12:
ఆళ్లపల్లి మండలంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. మార్కోడు గ్రామపంచాయతీ పరిధిలోని సుద్ధరేవు గ్రామంలో గత నాలుగేళ్లుగా నివాసం ఉంటున్న పూనేం రామ్ నారాయణ (50) శనివారం మర్కోడు జల్లేరు వాగు ఒడ్డున మృతదేహంగా కనిపించాడు.
రామ్ నారాయణ వలస గొత్తికోయ తెగకు చెందిన వ్యక్తిగా స్థానికులు తెలిపారు. దయ్యం పట్టిందని భావించిన వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంత్రాలు, పూజలు చేస్తూ నయం చేస్తాడని గ్రామస్తులు పేర్కొన్నారు.
మృతుడి ఛాతీపై కత్తితో దాడి చేసినట్లు ఆనవాళ్లు కనిపించడంతో హత్య జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై ఎస్ఐ సోమేశ్వర్ మాట్లాడుతూ.. ప్రాథమికంగా కత్తితో దాడి చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి అసలు కారణం, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు.
ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.