ఆళ్లపల్లి, సెప్టెంబర్ 3:
పోడు రైతు భూమిలో ట్రెంచ్ పనులు చేపట్టకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ బీట్ అధికారి ఏసీబీ వలకు చిక్కిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో కలకలం రేపింది.
రామానుజగూడెం గ్రామానికి చెందిన ఓ పోడు రైతు భూమికి సంబంధించిన విషయంలో బీట్ అధికారి బానోత్ రవికుమార్ రూ.30 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. లంచం మొత్తాన్ని మధ్యవర్తి సాదిక్ ద్వారా తీసుకునేందుకు ఒప్పందం జరిగినట్లు సమాచారం.
పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఖమ్మం రేంజ్ ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలోని అధికారులు రామానుజగూడెంలో వల పన్నారు. మధ్యవర్తి సాదిక్ ద్వారా లంచం తీసుకుంటున్న సమయంలో బీట్ అధికారి రవికుమార్ను అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు.
ఈ వ్యవహారంలో మధ్యవర్తి సాదిక్ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకుని తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు సమాచారం.
జిల్లాలో ఈ ఏడాది ఏసీబీ నమోదు చేసిన నాలుగో అవినీతి కేసు ఇదేనని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ విధుల్లో అవినీతికి పాల్పడే అధికారులపై ఏసీబీ నిఘా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.