ఆళ్లపల్లి: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని ఆళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాసం శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. “వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమర్ రహే” అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వాసం శ్రీకాంత్తో పాటు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళల సంక్షేమానికి అనేక కీలక పథకాలను అమలు చేశారని గుర్తుచేశారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108 అత్యవసర సేవలు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు.
రైతాంగ సంక్షేమానికి వైఎస్సార్ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోయాయని నాయకులు పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.