Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 12:22 pm Posted by : parivarthanaawaaz

నేరాల నియంత్రణకు ఫోకసింగ్ అప్రోచ్‌తో పనిచేయాలి: డీఐజీ సన్‌ప్రీత్ సింగ్

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి జిల్లా:  జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించి, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన  జోన్-III రాజన్న ఇన్‌చార్జ్ డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ ఐపిఎస్ వార్షిక తనిఖీలలో బాగంగా  కామారెడ్డి డీఎస్పీ కార్యాలయం సందర్శన. జోన్-III ఇన్‌చార్జ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్ శుక్రవారం కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించి జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ యం రాజేష్ చంద్ర ఐపిఎస్  జిల్లాలోని శాంతిభద్రతలు, నేరాల పరిస్థితి, వివిధ నేరాల నమోదు–దర్యాప్తు, కేసుల డిటెక్షన్, రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలు తదితర అంశాలపై డీఐజీ గారికి సమగ్ర వివరాలను అందించారు. అనంతరం డీఐజీ శ్రీ సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్ మాట్లాడుతూ కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కొన్ని రకాల నేరాలు తగ్గగా, మరికొన్ని నేరాల్లో పెరుగుదల కనిపిస్తున్నందున సంబంధిత అధికారులు నేరాల పెరుగుదలకు గల కారణాలను విశ్లేషించి, ఫోకసింగ్ అప్రోచ్‌తో నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.  నేరాల నియంత్రణలో భాగంగా పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, వారి నివాస ప్రాంతాలకు వెళ్లి పరిసర ప్రాంతాల ప్రజలతో మాట్లాడి వారి కార్యకలాపాలపై నిఘా ఉంచాలని  సూచించారు. నేరాలు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచిస్తూ, ప్రమాదం జరిగిన ప్రతి ప్రాంతాన్ని అధికారులు స్వయంగా సందర్శించి, ప్రమాదానికి గల కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతా చర్యలను సంబంధిత శాఖల సమన్వయంతో చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని, గంజాయికి బానిసైన వ్యక్తులను గుర్తించి డీ-అడిక్షన్‌కు అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు, గంజాయి సరఫరా, రవాణా వ్యవస్థను గుర్తించి మూలాలను ఛేదించే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సైబర్ నేరాలపై ముందస్తు జాగ్రత్తలు, సాంకేతిక భద్రతా చర్యలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది నిజాయితీగా, ధైర్యంగా విధులు నిర్వహిస్తూ నేరాల నివారణలో 100 శాతం కఠినంగా, సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.  ప్రజల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు విస్తృతంగా చేపట్టాలి.  పోలీస్ స్టేషన్లలో పరిశుభ్రత, క్రమబద్ధీకరణ కోసం 5S విధానాన్ని అమలు చేయాలని, సిబ్బంది విధి నిర్వహణలో మరింత సమర్థవంతంగా పనిచేసేలా నిరంతరం మోటివేట్ చేయాలని తెలిపారు. అలాగే గుట్కా, మట్కా, అక్రమ గేమింగ్, ఇతర జూద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగనివ్వకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వార్షిక తనిఖీలో భాగంగా కామారెడ్డి డీఎస్పీ కార్యాలయం సందర్శించి కార్యాలయ పరిశుభ్రత, రికార్డులు, కేసు ఫైల్స్ తదితరాలను డీఐజీ గారు పరిశీలించి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎస్పీ అడ్మిన్ కే. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డితో పాటు జిల్లాలోని సీఐలు, ఎస్సైలు మరియు ఇతర పోలీసు అధికారులు   పాల్గొన్నారు.