Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 4:17 pm Posted by : NUNELA KARUNKAR

విద్యుత్ షాక్ తో రైతు మృతి

మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం గంగాపూర్ తండాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తండాకు చెందిన మూడవత్ గోపాల్ (28) పొలం వద్ద విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ ఘటనతో గంగాపూర్ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

స్థానికుల సమాచారం ప్రకారం.. గోపాల్ తన పొలం వద్ద ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. తీవ్ర విద్యుదాఘాతానికి గురైన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.

గోపాల్ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడికి భార్య రజితతో పాటు ఒక చిన్నారి పాప ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన గోపాల్ ఆకస్మికంగా మృతి చెందడంతో భార్య, చిన్నారి పరిస్థితి విషాదకరంగా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యుత్ షాక్‌కు గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది. పొలాల వద్ద విద్యుత్ లైన్లు, విద్యుత్ పరికరాల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.