Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 1:43 pm Posted by : laxman RAO

మాలల న్యాయపోరాట సభకు సన్నాహాలు

కొత్తగూడెంలో కరపత్రం ఆవిష్కరణ – ఎస్సీ ఉపవర్గీకరణపై మాల సంఘాల ఐక్య స్వరం

పరివర్తన ఆవాజ్,కొత్తగూడెం

ఎస్సీ ఉపవర్గీకరణ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, మాల సంఘాలు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో మే 10న కొత్తగూడెంలోని జి.ఎస్. మినీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న “మాలల న్యాయపోరాట సభ”కు సంబంధించిన కరపత్రాన్ని గురువారం సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు నిర్ణయంతో 59 షెడ్యూల్ కులాలను కులాల ఆధారంగా వర్గీకరించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు సూచించిన విధంగా ఆర్థిక, విద్యా, సామాజిక అభివృద్ధి ప్రమాణాల ఆధారంగా ఎంపిరికల్ డేటా సేకరించి ఎస్సీల ఉపవర్గీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తెలంగాణలోని అన్ని మాల సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి న్యాయపోరాటాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాబోయే తరాల భవిష్యత్తు, విద్యా మరియు ఉద్యోగ అవకాశాల పరిరక్షణ కోసం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎడ్యుకేట్స్ అసోసియేషన్ ఫర్ మాల సభ్యులు, రిటైర్డ్ జనరల్ మేనేజర్ శనగ వెంకటేశ్వర్లు, అడిషనల్ జనరల్ మేనేజర్ గొనె శ్రీకాంత్, ఆచార్య డా. మద్దెల శివకుమార్, మాలమహానాడు సెక్రటరీ జనరల్ ఎస్. మధుసూదన్ (చిన్ని), జె. శ్రీనివాస్, గడ్డం రఘన్ బాబు, ఎన్.డి. సాగర్, దార్ల లక్ష్మి, దాసరి రమేష్, శనగ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.సభ ముగింపులో మాల సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు సాగుతూ ఎస్సీ ఉపవర్గీకరణ అంశంలో న్యాయం సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.