Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 11:05 am Posted by : laxman RAO

ప్రధాన మంత్రి సూర్యఘర్ ముక్తి బిజిలీ యోజనను సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ అంకిత్

పరివర్తన అవాజ్,కొత్తగూడెం సోమవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో *ప్రధాన మంత్రి సూర్యఘర్ ముక్తి బిజిలీ యోజన పథకంపై అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి సూర్యఘర్ ముక్తి బిజిలీ యోజనను జిల్లాలో అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా ఇళ్ల పైభాగంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని, స్వయం విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలిపారు.సోలార్ విద్యుత్ వినియోగం పర్యావరణ పరిరక్షణకు దోహదపడటంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు . అదనంగా, వినియోగించని విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి తిరిగి ఆదాయం పొందే అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తుందని తెలిపారు.దేశవ్యాప్తంగా ఒక కోటి కుటుంబాలకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ఈ పథకం లక్ష్యమని వెల్లడించారు.సబ్సిడీ వివరాలను తెలియజేస్తూ, 2 కిలోవాట్ వరకు ప్రతి కిలోవాట్‌కు రూ.30,000, 3 కిలోవాట్ మరియు అంతకంటే ఎక్కువ సామర్థ్యంపై అదనంగా రూ.18,000 సబ్సిడీ అందించబడుతుందని తెలిపారు.పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, విద్యుత్ బిల్, బ్యాంక్ పాస్‌బుక్, ఫోటో అవసరమని తెలిపారు. అర్హులైన వినియోగదారులు అధికారిక వెబ్‌సైట్ pmsuryaghar.gov.in లో నమోదు చేసుకుని రాష్ట్రం, విద్యుత్ పంపిణీ సంస్థ, కస్టమర్ నంబర్ తదితర వివరాలను నమోదు చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, టీజీఎన్‌పీడీసీఎల్ ఎస్సీ జి. మహేందర్, టీజీఆర్‌ఈడీసీఓ జిల్లా మేనేజర్ పి. అజయ్ కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.