Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 2:22 pm Posted by : laxman RAO

జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం

పకడ్బందీగా నిర్వహణ : జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు

పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం నుండి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన వివిధ పరీక్షా కేంద్రాలలో ప్రాక్టికల్ పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.

ఈరోజు నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షలలో ఉదయం సెషన్‌లో జనరల్ కోర్స్‌లో 974 మంది విద్యార్థులకు గాను 948 మంది హాజరుకాగా 26 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ కోర్స్‌లో 1,381 మందికి గాను 1,324 మంది పరీక్షలకు హాజరుకాగా 57 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 2,365 మందికి గాను 2,182 మంది హాజరై 83 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం సెషన్‌లో జనరల్ కోర్స్‌లో 703 మందికి గాను 685 మంది హాజరై 17 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ కోర్స్‌లో 1,362 మందికి గాను 1,296 మంది హాజరై 66 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 2,065 మందికి గాను 1,982 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 83 మంది గైహాజరయ్యారని తెలిపారు.

ప్రాక్టికల్ పరీక్షల ప్రారంభ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు జిల్లాలోని మణుగూరు, ఎడులబయ్యారం, భద్రాచలం ప్రాంతాలలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్న కళాశాలలను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ల్యాబ్ సదుపాయాలు, హాజరు నమోదు విధానం, ప్రశ్నపత్రాల గోప్యత, తదితర అంశాలను ఆయన సమగ్రంగా పరిశీలించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం మరియు ఇంటర్మీడియట్ విద్యామండలి మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తూ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కళాశాల యాజమాన్యాలకు, పరీక్షా సిబ్బందికి సూచనలు చేశారు.

మిగిలిన రోజుల్లో కూడా ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను ఇదే విధంగా శాంతియుతంగా, సమర్థవంతంగా నిర్వహిస్తామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.