Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 5:52 am Posted by : laxman RAO

కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిపై కాంగ్రెస్‌లో హోరాహోరీ… కష్టపడ్డ వారికి దక్కుతుందా గౌరవం?

ఆందోళనలో కాంగ్రెస్ ఆశావాలు…?

పరివర్తన  అవాజ్,కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో రాజకీయ వేడి మళ్లీ పెరుగుతోంది. వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో లోపలే తీవ్ర పోటీ నెలకొనడంతో స్థానిక రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి.

పార్టీ కష్టకాలంలో వీధివీధి తిరిగి జెండాలు మోసిన వారు, అరెస్టులు ఎదుర్కొన్న వారు, ఎన్నికల సమయంలో భుజాలు కాయలయ్యేలా శ్రమించిన కార్యకర్తలు ఇప్పుడు ఒక్క మాటే అంటున్నారు — “ఈసారి అయినా మా కష్టానికి గుర్తింపు దక్కాలి.”

ఎన్నికల సమయంలో పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయనే అసంతృప్తి బహిరంగంగానే వినిపిస్తోంది. గతంలోనూ పలుమార్లు ఆశలు పెంచి చివరికి నిరాశ మిగిల్చిన సందర్భాలు ఉండటంతో ఈసారి నిర్ణయం ఎలా ఉంటుందన్నదే హాట్ టాపిక్‌గా మారింది.

స్థానికంగా సీనియర్ నాయకులు, యువ ఆశావాహులు, సామాజిక వర్గాల సమీకరణలతో పలువురు పేర్లు చైర్మన్ రేసులో వినిపిస్తున్నాయి. అయితే “పార్టీకి చివరి నిమిషంలో చేరిన వారికా? లేక సంవత్సరాలుగా కష్టపడ్డ అసలైన కాంగ్రెస్ సైనికులకా?” అన్న ప్రశ్న కార్యకర్తల మధ్య చర్చనీయాంశమైంది.

కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే తుది నిర్ణయం కొత్తగూడెం రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేయనుంది. కష్టపడ్డ వారికి గౌరవం దక్కుతుందా? లేక మరోసారి నామినేటెడ్ పదవి కొందరి చేతుల్లోకే పరిమితమవుతుందా?

ఇప్పుడు అందరి చూపు ఒకటే — కాంగ్రెస్ నాయకత్వంపై. ఈసారి నిజాయితీకి ముద్ర వేస్తుందా? లేక అసంతృప్తికి తావిస్తుందా? త్వరలోనే తేలనుంది.