Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 3:10 pm Posted by : laxman RAO

లిక్విడ్ గంజాయి పట్టివేత

 

వివరాలు వెల్లడించిన డీఎస్పీ అబ్దుల్ రెహమాన్

పరివర్తన అవాజ్,కొత్తగూడెం

కొత్తగూడెం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిషేధిత మత్తుపదార్థాల అక్రమ రవాణాపై పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో ఎవరికి అనుమానం రాకుండా తరలిస్తున్న లిక్విడ్ గంజాయిని వన్‌టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాలను కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మంగళవారం వెల్లడించారు.

డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం… మంగళవారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటల సమయంలో వన్‌టౌన్ సీఐ శివప్రసాద్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే సిబ్బందితో కలిసి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు.

ఈ సమయంలో టీవీఎస్ జూపిటర్ స్కూటీపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ఆపి తనిఖీ చేయగా, వారి వద్ద నిషేధిత గంజాయితో తయారుచేసిన హాషిష్ ఆయిల్ (లిక్విడ్ గంజాయి) 3 కిలోలు లభ్యమైంది. దీని అంచనా మార్కెట్ విలువ సుమారు రూ.15 లక్షలుగా పోలీసులు తెలిపారు.

అరెస్టయిన వ్యక్తులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా జగదల్పూర్‌కు చెందిన తింతి బేల, ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా లిమతం గ్రామానికి చెందిన ఇంతంగి మీనారావుగా గుర్తించారు. వారి వద్ద నుంచి హాషిష్ ఆయిల్‌తో పాటు ఒక స్కూటీ, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి, ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు.