Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 11:09 am Posted by : laxman RAO

మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి

పరివర్తన అవాజ్,కొత్తగూడెం

అన్ని గ్రామపంచాయతీల్లో తీర్మానాలు చేయాలి : డీసీసీ అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న

జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, పెద్దలు, అన్ని గ్రామపంచాయతీల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు ఈ విషయాన్ని గమనించాలని కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న ఒక ప్రకటనలో తెలిపారు.

కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో మహాత్మా గాంధీ పేరుతో నడుస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, కోట్లాది మంది గ్రామీణ పేదల జీవనాధారాన్ని దెబ్బతీయాలని చూస్తోందని ఆమె తీవ్రంగా విమర్శించారు.

ఈ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా, ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అన్ని గ్రామపంచాయతీల్లో యథావిధిగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలంటూ తీర్మానాలు చేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని తెలిపారు.

ఆ పిలుపులో భాగంగా తెలంగాణ పీసీసీ (టీపీసీసీ) నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఈ తీర్మానాలు చేపించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని ఆమె కోరారు.

గ్రామీణ పేదల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని, ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరచే ప్రయత్నాలను సహించేది లేదని తోటా దేవి ప్రసన్న స్పష్టం చేశారు.