Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 24 January 2026, 3:39 pm Posted by : laxman RAO

డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్.కె గౌస్ పాషా

పరివర్తన అవాజ్,కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్.కె గౌస్ పాషా శుక్రవారం డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 39వ డివిజన్ కార్పొరేటర్‌గా మైనార్టీ కోటాలో తనకు అవకాశం కల్పించాలని గౌస్ పాషా డిసిసి అధ్యక్షురాలిని కోరారు. గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తూ, పార్టీ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న తన సేవలను గుర్తించి అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పార్టీ కోసం పని చేసిన కారణంగా గతంలో తనపై అక్రమ కేసులు పెట్టినప్పటికీ, ఎలాంటి భయపడకుండా కాంగ్రెస్ జెండాను వదలలేదని గౌస్ పాషా తెలిపారు. ఆనాటి పిసిసి అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నానని, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్వంచ పట్టణం మరియు పంచాయతీల పరిధిలో కీలక పాత్ర పోషించానని వివరించారు.

పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికీ అవకాశాలు ఇస్తున్నారని, అయితే మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. ఇప్పటివరకు ఎలాంటి పదవులు పొందకుండా సాధారణ కార్యకర్తగానే పార్టీ కోసం పనిచేశానని, ఇప్పుడు 39వ డివిజన్ కార్పొరేటర్‌గా అవకాశం కల్పించాలని కోరారు.

ఈ సందర్భంగా స్పందించిన డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ, పార్టీ కోసం నిజాయితీగా కష్టపడిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫరీద్, పక్రుద్దీన్, యాకుబ్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.