Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 10:52 am Posted by : laxman RAO

జిల్లా కేంద్ర గ్రంథాలయానికి పుస్తకాల విరాళం

పరివర్తన అవాజ్,కొత్తగూడెం

జిల్లా కేంద్ర గ్రంథాలయానికి విలువైన పోటీ పరీక్షల పుస్తకాలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సెంట్రల్ ఆటో వర్క్‌షాప్‌లో సూపర్ డెండెంట్ ఇంజనీర్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్న ఆర్. రామ శేషయ్య విరాళంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఇంజనీరింగ్‌కు సంబంధించిన పుస్తకాలతో పాటు నీట్, ఐఐటీ, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను జిల్లా గ్రంథాలయానికి అందజేశారు.

పుస్తకాలను అందుకున్న అనంతరం జిల్లా గ్రంథాలయం తరఫున గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు దాత ఆర్. రామ శేషయ్యను అభినందించారు. ఇలాంటి దాతలు మరింతమంది ముందుకు వస్తే గ్రంథాలయాలను ఆశ్రయిస్తున్న పోటీ పరీక్షల విద్యార్థులకు ఎంతో లాభం చేకూరుతుందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని దాతలు గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రంథపాలకురాలు జి. మణి మృదుల దాతకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, విద్యార్థినులు, పాఠకులు పాల్గొన్నారు.