Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 18 January 2026, 12:23 pm Posted by : laxman RAO

చేపలు, చికెన్, మాంసం దుకాణాలపై విస్తృత తనిఖీలు

12 కేసులు నమోదు— తూనికలు కొలతలు శాఖ అధికారి మనోహర్

పరివర్తన అవాజ్, కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో వినియోగదారుల హక్కుల పరిరక్షణలో భాగంగా, ఆదివారం తూనికలు కొలతలు శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం సంత ప్రాంతం, కొత్తగూడెం పట్టణం అన్నపూరెడ్డిపల్లి మండలంలోని చేపలు, చికెన్, మాంసం విక్రయ దుకాణాలపై విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించడమైందని తూనికలు కొలతలు శాఖ అధికారి కే. మనోహర్ తెలిపారు.

ఈ తనిఖీలలో తూనికలు కొలతల చట్టం, సంబంధిత నిబంధనలను ఉల్లంఘిస్తూ ధృవీకరణ లేని తూకపు యంత్రాలు వినియోగించడం, సరైన ముద్రలు లేకుండా తూకాలు నిర్వహించడం, కొలతల్లో తేడాలు చూపించడం వంటి అక్రమాలు గుర్తించబడినట్లు తెలిపారు. ఈ ఉల్లంఘనలపై మొత్తం 12 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.
తూనికలు కొలతల చట్టాన్ని ఉల్లంఘించిన వ్యాపారులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆయన స్పష్టం చేశారు. వినియోగదారులను మోసగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.

అన్ని వ్యాపారులు తప్పనిసరిగా ప్రభుత్వ ధృవీకరణ పొందిన తూకపు యంత్రాలనే వినియోగించాలని, నిర్ణీత కాలవ్యవధిలో పునఃధృవీకరణ చేయించుకోవాలని సూచించారు. వినియోగదారులు కూడా తూకాల్లో అక్రమాలు గమనించినట్లయితే జిల్లా తూనికలు కొలతలు శాఖ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని కోరారు.భవిష్యత్తులో కూడా జిల్లాలోని సంతలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని తూనికలు కొలతలు శాఖ అధికారి మనోహర్ తెలిపారు.