Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 21 January 2026, 12:54 pm Posted by : laxman RAO

కార్పొరేషన్ ఎన్నికల ప్రచారజోరు పెంచిన సిపిఐ

రామవరం 6డివిషన్ల విస్తృత సమావేశం

రామవరం డివిజన్లలో మరింత పట్టు సాదించాలి : సాబీర్ పాషా

పరివర్తన అవాజ్,కొత్తగూడెం

త్వరలో జరగనున్న కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార జోరును సిపిఐ పెంచింది. ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలను సంసిద్ధులను చేసేందుకు జరుగుతున్న డివిజన్ల స్థాయి సమావేశాల్లో భాగంగా రామవరం పరిధిలోని ఆరు డివిజన్ల విస్తృత స్థాయి సమావేశం బుధవారం పార్టీ కార్యాలయం విఠల్ రావు మెమోరియల్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పాల్గొని మాట్లాడారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో అంతర్భాగంగా ఉన్న రామవరం పట్టణంలో సిపిఐకి తిరుగులేదని, అనాదిగా ఇక్కడి ప్రజలు సిపిఐని ఆదరిస్తున్నారని, ప్రజలకు సిపిఐ అందిస్తున్న సేవలే ఇందుకు కారణమన్నారు. కొత్తగూడెం పట్టణ అభివృద్ధి సిపిఐతోనే సాధ్యమని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేది తమ పార్టీయేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా రామవరం ప్రాంతంలోని డివిజన్లలో పార్టీకి బలమైన పట్టు ఉందని, రాబోయే ఎన్నికల్లో ఈ ఆరు డివిజన్లలో సిపిఐ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని కోరారు. వార్డుల వారీగా ఉన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రజలతో కలిసి పోరాడాలని సూచించారు. స్థానిక శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు కృషితో కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి, నిస్పక్షపాతంగా అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. రామవరం ప్రాంత ప్రజలకు పోజేషన్ సర్టిఫికెట్లు, మాజీ కార్మికులు, పేదలు నివసిస్తున్న సింగరేణి క్వార్టర్లపై హక్కు కల్పించేందుకు కృషి జరుగుతోందన్నారు. కార్యకర్తలు ఐక్యమత్యంతో శ్రమించి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని, అప్పుడే మున్సిపల్ కార్పొరేషన్‌లో సమస్యలన్యుల గొంతు వినిపిస్తుందని సాబీర్ పాషా ఉద్ఘాటించారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య, ఎస్ కె ఫహీమ్, జిల్లా సమితి సభ్యులు భూక్యా శ్రీనివాస్, మునిగడప వెంకటేశ్వర్లు, మునిగడప పద్మ, నాయకులు గోపి కృష్ణ, రంగా రావు, గుత్తుల శ్రీనివాస్, తూముల శ్రీను, మండల రాజు, సుధాకర్, ఖయూమ్, సత్యనారాయణ చారి, జలీల్, షాహీన్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.