Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 08 October 2025, 3:21 pm Posted by : parivarthanaawaaz

Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం సీట్లు గెలుచుకుంటాం: మహేశ్ కుమార్ గౌడ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం సీట్లను గెలుచుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు హైకోర్టులో బలమైన వాదనలు వినిపించారని తెలిపారు.

గురువారం ఉదయం నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. న్యాయస్థానంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీసీల నోట ముద్ద లాక్కోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీసీల బిల్లుకు అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తుచేశారు.

మేం రెడీ: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో బీజేపీ చాలా బలంగా ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. హైకోర్టులో ఓడిపోయి ఎన్నికలు వాయిదా వేసే కుట్రకు కాంగ్రెస్ తెరలేపిందని ఆరోపించారు. అందుకే న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించలేదని అన్నారు.