Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 10 October 2025, 11:43 am Posted by : parivarthanaawaaz

సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం.. అన్ని శాఖల సమగ్ర సమాచారం ఆన్లైన్లో పొందుపరచాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో పరివర్తన అవాజ్ న్యూస్ (అక్టోబర్, 10) ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టం గురించి అవగాహన పెంపొందించుకుని, దాని ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలపై సమాచారం పొందడమే కాకుండా ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వామ్యులవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు.సమాచార హక్కు చట్టం 2005 అమలులోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, శుక్రవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు జిల్లా కలెక్టర్ డి. వేణుగోపాల్ తో కలసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ —సమాచార హక్కు చట్టం ప్రజలకు శక్తినిచ్చే చట్టం అని అన్నారు. ఇది ప్రభుత్వ పారదర్శకతను పెంపొందించి, అధికార యంత్రాంగంలో జవాబుదారీతనాన్ని నెలకొల్పుతోందని తెలిపారు . ప్రజలు కోరిన సమాచారం సకాలంలో అందించడం ద్వారా పరిపాలనా విశ్వసనీయత మరింతగా పెరుగుతోంది అని,ప్రతి శాఖ అధికారులు ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు సేవ చేయాలి అని తెలిపారు.

అన్ని శాఖల అధికారులు తమ శాఖల వారీగా నిర్వహిస్తున్న కార్యకలాపాలు, సేవలు, నిర్ణయాలు, సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్‌లో జిల్లా అధికారిక వెబ్ సైట్ నందు పొందుపరిచే విధంగా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు సమాచారం కోసం దరఖాస్తు చేసుకునే ముందు, వారు కోరిన సమాచారం ఇప్పటికే అందుబాటులో ఉండేలా వ్యవస్థను బలోపేతం చేయాలి అన్నారు. ఇది పారదర్శక పరిపాలనకు దోహదం చేస్తుంద అని ఆయన పేర్కొన్నారు.

ప్రతి కార్యాలయంలో పీఐఓ, ఎపీఐఓ, అప్పీలేట్ అథారిటీ నియమించి, ఆర్టీఐ దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలి. ప్రజల దరఖాస్తులపై సానుకూల దృక్పథంతో స్పందిస్తూ అవసరమైన మార్గదర్శకతతో సహా పూర్తి సమాచారం అందించాలి. సమాచారాన్ని నిరాకరించినప్పుడు దానికి గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలి అని సూచించారు. అన్ని శాఖల అధికారులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించాలని దానికి అవసరమైన శిక్షణ తరగతులు నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులు మరియు సిబ్బంది తో సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తూ ప్రజల విజ్ఞప్తులకు సకాలంలో స్పందించడం, స్వచ్ఛందంగా ఇవ్వవలసిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం, పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తూ విధులు నిర్వర్తిస్తామని వారు ప్రతిజ్ఞ చేసి తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సిపిఓ సంజీవరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా వైద్య శాఖ అధికారి జయలక్ష్మి, డి సి ఓ రుక్మిణి, బీసీ సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి, ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్, భూగర్భ జల శాఖాధికారి రమేష్ మరియు అన్ని శాఖల జిల్లా అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.