లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు
కలెక్టర్ రాహుల్ రాజ్ నేతృత్వంలో కొనసాగిన ప్రక్రియ
పరివర్తన అవాజ్ మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం సోమవారం మెదక్ బోధన్ రోడ్ లోని వెంకటేశ్వర గార్డెన్ లో లాటరీ పద్దతిలో వైన్ షాపుల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా సాఫీగా ఈ ప్రక్రియ కొనసాగింది. నూతన ఎక్సయిజ్ పాలసీ నియమ, నిబంధనలను అనుసరిస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పక్కాగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 49 మద్యం షాపులకు గాను మొత్తం 1420 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఒక్కో షాపు వారీగా దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన వారిని ఆహ్వానిస్తూ, వారి సమక్షంలో కలెక్టర్ రాహుల్ రాజ్ లక్కీ డ్రా తీస్తూ మద్యం దుకాణాల కేటాయింపును ఖరారు చేశారు. లక్కీ డ్రా కోసం వినియోగించిన టోకెన్ లను అందరికీ చూపిస్తూ, పారదర్శకంగా డ్రా నిర్వహించారు. ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా లక్కీ డ్రా ప్రక్రియ ప్రారంభం నుండి చివరి వరకు ఫొటో, వీడియో చిత్రీకరణ జరిపించారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు హాజరు కావడంతో టోకెన్ కలిగి ఉన్న వారినే లోనికి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా వెంకటేశ్వర గార్డెన్ తో పాటు పరిసర ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ మహేందర్, డి.ఎస్.పి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తును పర్యవేక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు. లక్కీ డ్రాలో అదృష్టం వరించి వైన్ షాపులు కేటాయించబడిన వారు నిబంధనలను అనుసరిస్తూ, లైసెన్స్ ఫీజు రూపేణా నిర్ణీత రుసుము చెల్లించేందుకు వీలుగా వేదిక వద్దనే అవసరమైన ఏర్పాట్లు కల్పించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి ఇతర అధికారుల పర్యవేక్షణలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డ్రా ప్రశాంతంగా కొనసాగింది.
ఈ సందర్భంగా లాటరీ ప్రక్రియ కొనసాగించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ మెదక్ జిల్లాలో మొత్తం 49 మద్యం షాపులు ఉన్నాయని మెదక్ వెంకటేశ్వర గార్డెన్లో అత్యంత పారదర్శకంగా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ద్వారా లక్కీ డ్రా తీయడం జరిగిందన్నారు. ఇందులో
రిజర్వేషన్ ప్రాతిపదికలో భాగంగా గాను ఎస్టి -01, ఎస్సీ-06 , గౌడ కులానికి సంబంధించి-09 మొత్తం 16 షాపులు కేటాయించామన్నారు, మిగతా 33 షాపులు అన్ రిజర్వ్ కింద కేటాయించడం జరిగిందన్నారు.
ఇందులో 18 షాపులకు మహిళలు లాటరీ గెలుచుకోగా, 31 షాపులకు
పురుషులు దక్కించుకోవడం జరిగిందన్నారు. మద్యం టెండర్లు దక్కించుకున్న వారు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మద్యం షాపులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

