మెదక్ జిల్లాలో వలస కూలీల పిల్లల దుర్భర పరిస్థితులు అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
(పరివర్తన) ఆవాస్ న్యూస్ మెదక్ జిల్లా, చిన్న శంకరంపేట మండలం కామారం గ్రామ శివారులోని ఎస్జి స్నాక్స్ పరిశ్రమ వద్ద బీహార్ నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన వలస కూలీల పిల్లలు అమానుష పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నారు. పరిశ్రమలో పని చేసేందుకు వచ్చిన కూలీలతో పాటు వారి పిల్లలు కూడా ఇక్కడే ఉండాల్సి వస్తోంది. అయితే వారికి కనీస అవసరాలైన వసతి, పరిశుభ్రత, తాగునీరు, విద్య వంటి సౌకర్యాలు లేకపోవడంతో జీవితం అద్వానంగా మారింది. సుమారు 30 మంది చిన్నారులు ఎలాంటి సదుపాయాలు లేని ప్రాంతంలో రోజంతా మట్టిలో ఆడుతూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమ యాజమాన్యం పిల్లల కోసం సౌకర్యం కూడా కల్పించకపోవడంతో పాటు, ప్రభుత్వ అధికారులు కూడా ఈ సమస్యను పట్టించుకోకపోవడం స్థానికుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. బాల కార్మిక వ్యవస్థ, శిశు సంక్షేమ శాఖ వంటి శాఖలు చిన్నారుల సంక్షేమంపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, ఈ ఘటనపై వారు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వలస కూలీలకు వసతి, విద్య, వైద్యం వంటి కనీస సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాల్సి ఉంటుందని స్థానికులు గుర్తుచేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖలు మేల్కొని, వలస కార్మికులు మరియు వారి చిన్నారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.



