మహిళను బెదిరించి నగదు దోచుకున్న ఇద్దరు నిందితులు అరెస్ట్ – మాచారెడ్డి పోలీసుల చాకచక్యం
వాహన తనిఖీల్లో పట్టుబడ్డ నిందితులు, నగదు-బైక్ స్వాధీనం
కామారెడ్డి, మార్చి 24 (అవాజ్ న్యూస్): మాచారెడ్డి మండలంలో మహిళను బెదిరించి నగదు దోచుకున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి చాకచక్యంగా కేసును ఛేదించారు. ఈ నెల 23న అక్కపూర్ గ్రామానికి చెందిన హరి రాజవ్వ (62) మాచారెడ్డి చౌరస్తా వద్ద కొనుగోలు కోసం వెళ్లి తిరిగి ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్పై వచ్చి ఆమెను బెదిరించి రూ.5,000 నగదు దోచుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో 24న పాల్వంచమర్రి వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా, దోపిడీకి పాల్పడ్డట్లు అంగీకరించారు. నిందితుల వద్ద నుండి రూ.3,000 నగదు, ఒక బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించగా, ప్రజలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే సమాచారం అందించాలని సూచించారు.

