చల్లసముద్రం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ లో నుంచి నలుగురు సస్పెండ్!
చల్లసముద్రం పరివర్తన ఆవాజ్ డిసెంబర్ 06: చల్లసముద్రం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తాటి భిక్షంకు వ్యతిరేకంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా ఎల్లంపల్లి బుచ్చయ్య, సట్ల శ్రీను, మరియు మోడెం కోటయ్య,కాటూరి సతీష్ లను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి సైదులు ప్రకటించారు. పార్టీ కార్యక్రమాలకు భంగం కలిగించే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని, 29 గ్రామ పంచాయతీలలోని అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం స్థాపించబడిందని, గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని అభివృద్ధిని, సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం స్వల్ప కాలంలోనే అమలు చేస్తోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ కింద ₹10 లక్షల కవరేజీ వంటి పథకాల ద్వారా పేదలు, రైతులు, కార్మికులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. పార్టీ చేస్తున్న మంచి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్లోకి చేరుతున్నారని, దీనివల్ల అనేక పంచాయతీలు ఏకగ్రీవం అవుతున్నాయని వివరించారు. చివరగా, 17వ తేదీన జరిగే సర్పంచ్ ఎన్నికల్లో పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకే ఉంటుందని, ప్రజలందరూ ఈ గడువులోగా తప్పకుండా ఓటు వేయాలని కోరారు.

