గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి సమస్యలు పరిష్కరించాలి.
పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 14 మహబూబాబాద్. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల సమస్యలను పరిష్కరించాల మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతి విద్యార్థికి కార్పొరేట్ స్థాయిలో విద్యా సదుపాయాలు కల్పిస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదని ఆయన మండిపడ్డారు. మంగళవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఆయన చెప్పారు — “గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లేమి విద్యార్థుల భవిష్యత్తును చీకటిలో నెడుతోంది. వసతి గృహాల్లో ఫ్యాన్లు లేక, కరెంటు స్విచ్బోర్డులు దెబ్బతిని ఉండటం వల్ల విద్యార్థులు తీవ్రమైన వేడిని తట్టుకోలేక రాత్రంతా నిద్రలేక అవస్థలు పడుతున్నారు. పాఠశాల తరగతి గదుల్లో కూడా ఫ్యాన్ సౌకర్యం లేక విద్యార్థులు చెమటలు పట్టే పరిస్థితి నెలకొంది” అని వివరించారు. పాఠశాల హాస్టల్ ఆవరణలో రాత్రివేళల్లో ఒక్క లైట్ కూడా వెలగడం లేదని, చీకటిలో విద్యార్థులు భయంతో బయటకు రాలేకపోతున్నారని తెలిపారు. బాత్రూంలలో కూడా టాప్స్ పాడైపోవడంతో నీటి సౌకర్యం దాదాపు నిలిచిపోయిందని, లైట్లు లేకపోవడంతో చిన్నారులు రాత్రివేళల్లో అవస్థలు పడుతున్నారని పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్ అన్నారు. “హాస్టల్ గదులు మురికితో నిండిపోయి దుర్వాసన వస్తోంది. పరిశుభ్రత కోసం స్వీపర్లు లేకపోవడంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. మంచినీటి టాప్స్ పాడైపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇది చాలా దారుణం” అని ఆయన తీవ్రంగా విమర్శించారు. కొన్ని ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు నేలపై కూర్చొని భోజనం చేయాల్సి వస్తోందని, భోజనం నాణ్యత సరిగా లేక విద్యార్థులు అర్ధాకలితో తరగతులకు హాజరవుతున్నారని తెలిపారు. “ఇలాంటి పరిస్థితులు కొనసాగితే గిరిజన విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. తక్షణమే అధికారులు స్పందించి పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పించాలి” అని ఆయన డిమాండ్ చేశారు. పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్ రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖను ఉద్దేశించి, మాట్లాడుతూ “గిరిజన పిల్లలు చదువుకుంటున్న పాఠశాలల్లో చీకటిని తొలగించండి. ఫ్యాన్లు, లైట్లు, నీటి సదుపాయాలు, పరిశుభ్రతా సిబ్బంది — ఇవన్నీ మానవ హక్కుల భాగం. వెంటనే చర్యలు తీసుకోకపోతే పిడిఎస్యు తరఫున ఉద్యమం ప్రారంభిస్తాం” అని హెచ్చరించారు.

