*శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ నవంబర్ 17*
శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని గచ్చిబౌలి లో గచ్చిబౌలి ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో సంధ్యా కన్వెన్షన్ యజమాని సంధ్యా శ్రీధరరావు ఆక్రమించిన రహదారి, పార్కుల విషయంపై హైకోర్టు ఇటీవల తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేయడంతో హైడ్రా అధికారులు సోమవారం ఉదయం సొసైటీ స్థలానికి వెళ్లి అనుమతులేని నిర్మాణాలను కూల్చివేసింది. ఇరవై ఎకరాల లేఔట్లో 162 ప్లాట్లు ఉన్నా వాటిలో అధికభాగం తనవేనన్న ధోరణితో సరిహద్దులు చెరిపేసి ఇష్టానుసారం నిర్మాణాలు చేశారని ప్లాట్ యజమానులు కోర్టుకు ఆధారాలతో సహా విన్నవించగా, అడిగితే దాడులు చేసి , బెదిరింపులు గురిచేసి, తమపై తప్పుడు కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు విధించిన రూ.10 లక్షల జరిమానా విషయం గుర్తుచేసిన బాధితుల వాదనలు విన్న హైకోర్టు “లేఔట్ అంటే లేఔటే… రహదారులు ఎవరికి వ్యక్తిగత ఆస్తి కావు” అంటూ హైడ్రాకు వెంటనే పునరుద్ధరణ ఆదేశాలిచ్చింది. దీనిపై హైడ్రా అధికారులు విచారణ చేపట్టి లేఅవుట్ దారులపై వేసిన షెడ్లు, సరిహద్దులు దాటి కట్టిన నిర్మాణాలను నిమిషాల్లో నేలమట్టం చేసింది.
