మైనారిటీల హక్కులపై అక్టోబర్ 3న బహిరంగ సభ
కేంద్ర విధానాలపై మైనారిటీలకు అవగాహన సభ
పరివర్తన ఆవాజ్ వరంగల్,సెప్టెంబర్ 16 : ముస్లిం,క్రిస్టియన్ మైనారిటీల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇండియన్ నేషనలిస్ట్ మూమెంట్(ఇనామ్)ఆధ్వర్యంలో అక్టోబర్ 3న హనుమకొండలోని జక్రియ ఫంక్షన్ హాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఇనామ్ కన్వీనర్ అయూబ్,ప్రజా సంఘాల నాయకులు తెలిపారు.మోటూరి కృష్ణ ప్రసాద్ సంస్మరణ సభగా నిర్వహించే ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.ప్రముఖ వక్త పరకాల ప్రభాకర్ కూడా హాజరుకానున్నట్లు తెలిపారు.వరంగల్–ములుగు రోడ్ సెంటర్లోని ముస్లిం కమ్యూనిటీ సెంటర్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.గత కొన్నేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లిం,క్రిస్టియన్ మైనారిటీల మనోభావాలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తోందని వారు ఆరోపించారు.ఈ అంశాలపై మైనారిటీలతో పాటు అన్ని మతాల ప్రజలకు అవగాహన కల్పించడమే సభ ఉద్దేశమన్నారు.అక్టోబర్ 3న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సభ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.సమావేశంలో రామబ్రహ్మం,ఎండీ మధార్,నాయుమ్,ఎండీ అలీమ్,ప్రవీణ్రాజ్,రాజ్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.