Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 4:27 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

హౌసింగ్ బోర్డు కాలనీ పునరాభివృద్ధి చేపట్టాలిపేదలకు ఇందిరమ్మ టవర్స్ నిర్మించాలిఅసెంబ్లీలో ఎమ్మెల్యే నాయిని…

సానుకూలంగా స్పందించిన హౌసింగ్ శాఖ మంత్రి…

పరివర్తన అవాజ్ సెప్టెంబర్ 18

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతాల్లో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న గృహ సమస్యలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు తెలంగాణ శాసనసభలో ప్రస్తావించారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలు అందుబాటులో లేకపోవడంతో అనేక మంది పేదలు సొంత ఇల్లు నిర్మించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీ సమస్యను ప్రత్యేకంగా ప్రస్తావించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు, వరంగల్–హనుమకొండ నగర ప్రాంతంలో సుమారు 40–50 సంవత్సరాల క్రితం నిర్మించిన హౌసింగ్ బోర్డు కాలనీలోని ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. సుమారు వెయ్యి ఇళ్లతో ఉన్న ఈ కాలనీ నగరంలోని కీలక ప్రాంతంలో ఉందని, కాలనీని ఆధునిక అవసరాలకు అనుగుణంగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు.

పాత ఇళ్లను రెనోవేషన్ చేయడమా, లేక అవసరమైతే వాటిని తొలగించి ఆధునిక బహుళ అంతస్తుల భవనాలను నిర్మించడమా అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ఎమ్మెల్యే కోరారు. ఒకే ప్రాంతంలో ఎక్కువ మంది ప్రజలకు ఇళ్లను అందించే విధంగా టవర్స్ నిర్మాణం చేపడితే స్థల సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు, పాత కాలనీకి కూడా కొత్త రూపు తీసుకురావచ్చని సూచించారు.

హౌసింగ్ బోర్డు కాలనీలోని కొంతమంది లబ్ధిదారులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు ఆ మొత్తాన్ని చెల్లించలేకపోయారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు తెలిపారు. ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అటువంటి వారికి మరోసారి అవకాశం కల్పించి, వన్‌టైమ్ సెటిల్‌మెంట్ సౌకర్యాన్ని అందించాలని కోరారు.

హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ కార్యక్రమం తరహాలోనే రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో హౌసింగ్ బోర్డు స్థలాలు అందుబాటులో లేని నిరుపేదలకు బహుళ అంతస్తుల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. ఇందులో భాగంగా వరంగల్–హనుమకొండ ప్రాంతానికి కూడా ఇందిరమ్మ టవర్స్ మంజూరు చేసి, అర్హులైన పేదలకు సొంత గృహాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు సభలో ప్రస్తావించిన హౌసింగ్ సమస్యలపై సంబంధిత శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలోని కార్పొరేషన్లలో నిరుపేదలకు ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, అందులో భాగంగా వరంగల్–హనుమకొండలో కూడా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి తెలిపారు.

అలాగే హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించిన వన్‌టైమ్ సెటిల్‌మెంట్ అంశాన్ని కూడా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సభలో సమాధానం ఇచ్చారు.