Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 1:06 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద  ఆధ్వర్యంలో టి బి ముక్త్ భారత్ అభియాన్ – జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం….

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక :: సెప్టెంబర్ 19

వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద  ఆధ్వర్యంలో టి బి ముక్త్ భారత్ అభియాన్ – జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలో టి బి ముక్త్ భారత్ అభియాన్ కమిటీలను ఏర్పాటు చేసి, టి బి స్క్రీనింగ్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. క్షయ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకొని గ్రామాల్లో నిక్షయ్ శివిర్ లు, టి బి స్క్రీనింగ్ శిబిరాలు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా స్థాయి నుంచి జెడ్ పి సి ఈ ఓ ద్వారా మండల ప్రత్యేక అధికారులకు అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు అందించాలని అన్నారు.ఎన్ సీ సి కమాండర్లు తమ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు, క్యాంపెయిన్లలో టి బి నివారణ మరియు అవగాహన అంశాలను చేర్చి ప్రజల్లో చైతన్యం కల్పించాలని కలెక్టర్ సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకొని టి బి స్క్రీనింగ్ శిబిరాలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు.ప్రజల్లో పోషణ, వ్యాధి నిరోధకత, పరిశుభ్రత, దగ్గు సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు మరియు టి బి వ్యాధి నివారణపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రోగ నిరోధక శక్తి తగ్గిన వ్యక్తుల్లో టి బి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండే నేపథ్యంలో, సంబంధిత ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించాలని సూచించారు.అలాగే, టి బి రోగులకు అవసరమైన పోషక సహాయం అందేలా నిక్షయ్ పోషణ అభియాన్ మరియు నిక్షయ్ మిత్ర కార్యక్రమాల ద్వారా సహకారం అందించేందుకు స్పాన్సర్లను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లా స్థాయి కమిటీ టి బి ముక్త్ భారత్ అభియాన్ అమలును పర్యవేక్షించడం, వివిధ శాఖల మధ్య సమన్వయం కల్పించడం, టి బి స్క్రీనింగ్, అవగాహన, చికిత్స మరియు పోషక సహాయ కార్యక్రమాలను సమీక్షించడం వంటి బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది.టి బి రహిత వరంగల్ జిల్లా సాధనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, ప్రజల భాగస్వామ్యంతో టి బి స్క్రీనింగ్, నివారణ, చికిత్స మరియు పోషక సహాయ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలి.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీ వై.వి. గణేశ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజా రెడ్డి, నర్సంపేట మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా. సంధ్యా రాణి, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి సూపరింటెండెంట్ డా. దామోదరి బాయి, టి బి ప్రోగ్రాం అధికారి డా. అరుణ్ జోషి, డి ఆర్ డి ఓ నాగ పద్మజ, జెడ్ పి సి ఇ ఓ ఎన్. వసంత, ఎన్ సి సి కమాండర్ కెప్టెన్ సదానందం, ఎస్. కీర్తన మాల, ఎన్ సి సి క్యాడెట్లు మరియు మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.